అంగరంగ వైభవంగా శ్రీ పార్వతిపరమేశ్వర రధోత్సవం

పొదిలి : మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం నాడు శ్రీ పార్వతిసమేత నిర్మమహేశ్వర స్వామి దేవస్థానం రధోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా జరిగే ఈ రధోత్సవ కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకోవడం అనాదిగా వస్తుంది. ప్రతి సంవత్సరంలాగానే సుమారు 20వేలమంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో పొదిలి పట్టణంలోని ప్రధానవీధులు మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయాయి.

అధికసంఖ్యలో భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదిలి సిఐ చిన్నమీరా సాహెబ్, ఎస్ఐ టి శ్రీరామ్, కొనకనమిట్ల ఎస్ఐ టి బాలకృష్ణ, దొనకొండ ఎస్ఐ పి సుబ్బారావు, ట్రైనీ ఎస్ఐలు టి భవాని,
జి వెంకట్, 30మంది ఏఎస్ఐ మరియు కానిస్టేబుళ్లతో భారీ పటిష్ఠ బందోబస్తును ఏర్పాటుచేసిన దర్శి డీఎస్పీ కె నాగరాజు ఎప్పటికప్పుడు భద్రతా చర్యలను పర్యవేక్షించి సలహాలు సూచనలు అందించారు.

రధోత్సవ కార్యక్రమానికి హాజరైన భక్తుల సౌకర్యార్థం భక్తులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, ఎండ తీవ్రతను తట్టుకునేందుకు మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేశారు.

ఈ రధోత్సవ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.