యస్పీ బీయస్పీ చెరో 38 స్ధానాల్లో పోటి పొత్తు ఖరారు ఆర్ఎల్డీ 2 స్ధానాల్లో సోనియా రాహుల్ పోటీ చేసే 2 స్ధానాల్లో మద్దతు

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్‌పీ) బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్‌పీ) అధినేతలు మాజీ ముఖ్యమంత్రిలు మాయవతి అఖిలేశ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. లక్నో లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో భాగంగా లోక్‌సభ సీట్ల పంపకంపై అనుసరించే విధానాలను తెలిపారు. బీజేపీని ఓడించాలనే ఏకైక లక్ష్యం, ప్రజలకు మేలు చేయాలనే తలంపుతోనే చరిత్రాత్మక పొత్తుకు సిద్ధపడినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కోసం అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో పోటీచేయబోమని.. అయితే వారితో పొత్తు పెట్టుకునే ఆలోచన మాత్రం లేదని స్పష్టం చేశారు.

తమ పార్టీతో పొత్తుకు అంగీకరించినందుకు బీఎస్పీ అధినేత్రి మాయవతికి అఖిలేశ్‌ యాదవ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఇరుపార్టీలు చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తాయని వెల్లడించారు. ఆర్‌ఎల్డీ పార్టీకి రెండు సీట్లు కేటాయించినట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి బలం లేదని, అందుకే పొత్తు విషయమై వారితో చర్చించలేదని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఎస్పీ-బీఎస్పీ కలిసి పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

కొత్త రాజకీయ విప్లవానికి తాము నాంది పలికామని ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం తమ రెండు పార్టీలు కృషి చేస్తాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ పాలనతో పట్ల దేశ ప్రజలంతా విసుగు చెందారని.. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగుల్లో ఎన్డీయే ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. వీరంతా కలిసి ఎన్నికల్లో మోదీకి తగిన బుద్ధి చెబుతారన్నారు. ఉప ఎన్నికల స్ఫూర్తితో గెలుపు సాధించి తీరతామని ధీమా వ్యక్తం చేశారు.