గోవింద నామస్మరణ విశ్వవ్యాప్తం చేస్తున్న తెలుగువారికి అభినందనలు : వైవి సుబ్బారెడ్డి

సింగపూర్ : కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఆరాధిస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

శనివారంనాడు సింగపూర్‌లో ప్రవాస తెలుగు ప్రజలు నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన అక్కడి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ ఇతర దేశాల్లోని తెలుగు ప్రజలు ఇలాగే శ్రీవారి కల్యాణాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. దేశం విడిచి వచ్చినా మన సంస్కృతి సంప్రదాయాలను మరచిపోకుండా వీధివీధినా శ్రీనివాసుడి ఆలయాలు నిర్మించుకోవడం అభినందనీయమన్నారు.

తిరుమలలో శ్రీవారి కల్యాణాన్ని అందరూ తిలకించలేరని… విదేశాల్లో ఉన్న అటువంటి వారికోసం విదేశాల్లోనూ నిర్వహించి ఆ అనుభూతిని అందరికీ పంచడం ఆనందదాయకమని….. లోక కల్యాణార్ధం, సర్వజనుల సుఖసంతోషాల కోసం శ్రీనివాస కళ్యాణాలు మరిన్ని దేశాల్లో నిర్వహించేందుకు టీటీడీ కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మార్గదర్శకాలతో మన దళిత,గిరిజన వాడల ప్రజలు కూడా స్వామి ఆశీస్సులు పొందేందుకు ఆలయాలు నిర్మించి కల్యాణాలు నిర్వహిస్తామన్నారు. ఇప్పటిదాకా వీఐపీ, వీవీఐపీ దర్శనాల పేరుతో దళారులు భక్తులను దోచుకున్నారని…. తిరుమలలో దళారి వ్యవస్థను అరికట్టేందుకు టీటీడీలో ప్రొటోకాల్‌, నాన్‌ ప్రొటోకాల్‌ దర్శనాలు చేపట్టి సామాన్య భక్తుడు క్యూలో వేచి ఉండే సమయాన్ని 16గంటల నుండి 8గంటలకు తీసుకొచ్చినట్లు తెలిపారు.

సింగపూర్‌ నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆన్‌లైన్‌ ద్వారా దర్శనాన్ని బుక్‌ చేసుకోవాలని…. తిరుమల వచ్చే ఎన్‌ఆర్‌ఐ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా తన దృష్టికి తీసుకుని వస్తే వెంటనే స్పందిస్తానన్నారు. టీటీడీ ద్వారా ఇంకా మెరుగైన వసతులు కల్పించేందుకు పాలకమండలి కృషి చేస్తున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలతారెడ్డి, తుడా చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సింగపూర్‌ కమ్యూనికేషన్స్‌, ఐటీ శాఖ మంత్రి ఈశ్వరన్‌ పాల్గొన్నారు.