GSLV F-11 రాకెట్ ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ISRO మరో ప్రయోగాన్ని విజయవంతం చేసింది. జీశాట్ 7-ఎ ఉపగ్రహాన్ని మోసుకుంటూ… GSLV F-11 రాకెట్ రివ్వుమంటూ నింగిలోకి ఎగిరింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ … రెండో ప్రయోగ వేదిక నుంచి సాయంత్రం 4.10కి ఈ ప్రయోగాన్ని నిర్వహించింది ఇస్రో. ఇండియా మరో గర్వకారణమైన అంతరిక్ష ప్రయోగాన్ని చేసిందని సైంటిస్టులు చెప్పారు. ఈ ప్రయోగానికి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు కౌంట్ డౌన్ మొదలైంది. మొత్తం మూడు దశల్లో నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది రాకెట్. 2వేల250 కిలోల బరువున్న GSAT 7-A శాటిలైట్ .. 18 నిమిషాల తర్వాత కక్ష్యలోకి చేరింది. 24 గంటల తర్వాత.. ఆ ఉపగ్రహం దిశ మార్చి పూర్తి స్థాయి కక్ష్యలోకి ప్రవేశపెడతారు సైంటిస్టులు. డిసెంబరు 5న యూరప్‌లోని ఫ్రెంచ్‌ గయానా నుంచి 5200 కేజీల బరువున్న భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని స్పేస్ లోకి పంపించారు. నెలరోజుల టైమ్ లో ఇస్రో చేస్తున్న మూడో ప్రయోగం ఇది.జీశాట్‌ 7-A ఉపగ్రహం 8 ఏళ్ల పాటు కమ్యూనికేషన్ సిస్టమ్ కు  సంబంధించి కీలకమైన సేవలు అందించనుంది. జీఎస్‌ఎల్‌వీ ద్వారా ఇప్పటికే 4 భారీ శాటిలైట్లను స్పేస్ లోకి పంపించారు ఇస్రో సైంటిస్టులు. వీటితో.. ఇంటర్నెట్‌, అడవులు, సముద్రాలు, వ్యవసాయ రంగ సమాచారాన్ని సేకరించనున్నారు. GSAT 7-A ఉపగ్రహంతో… ఇండియాలో మరింత వేగవంతమైన, విస్తృతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.