జనసేనలో చేరిన చంద్రశేఖర్ యాదవ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరబోయిన చంద్రశేఖర్ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా గిద్దలూరు శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ నుండి 2009లో పోటీ చేసి స్వల్పతేడాతో ఓటమి చెందారు. అనంతరం 2010లో వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన ఓదార్పు యాత్ర మొట్టమొదటగా గిద్దలూరు నియోజకవర్గంలో ప్రారంభించి విజయవంతం చేయడంలో ప్రధాన భూమిక వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఈ నియోజకవర్గంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ విజయం సాధించిన తర్వాత 2014ఎన్నికలలో పోటీకి దూరంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. గురువారం నాడు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నాయకుడైన చంద్రశేఖర్ యాదవ్ పార్టీలో చేరికతో జిల్లా జనసేన పార్టీకి బలం చేకూరినట్లయింది.