తెలంగాణకు చెందిన 528మద్యం బాటిళ్లు పట్టివేత… ఇద్దరు అరెస్టు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 528మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే కొనకనమిట్ల మండల పరిధిలోని గొట్లగట్టు గ్రామం వద్ద అక్రమంగా తెలంగాణ రాష్ట్రం గద్వాల నుండి తీసుకుని వచ్చిన మద్యం విక్రయాలకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు బుధవారంనాడు రెక్కీ నిర్వహించి 528మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి అవులయ్య తెలిపారు.


ఆంధ్రా తెలంగాణ సరిహద్దు నుండి కొనుగోలు చేసిన 11కేసుల మద్యాన్ని పశువుల దాణా వాహనంలో దాణా రవాణా చేస్తున్నట్లుగా దాణాలో దాచి ఉంచి తీసుకుని వచ్చే క్రమంలో పక్కా సమాచారం నిమిత్తం గొట్లగట్టు వద్ద తనిఖీలు నిర్వహించిన అధికారులు అశోక్ లైలాండ్ ఆటో నందు పశువుల దానాతో పాటుగా మద్యం లభించడంతో దరిశి మండలం ఎర్ర ఓబనపల్లి గ్రామానికి చెందిన బెల్లం రాజశేఖర్ రెడ్డి, ఆరేళ్ళపాడు గ్రామానికి చెందిన శాఖమూరి శ్రీనివాసరావులను అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ వెంకట్రావు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.