కుప్పంలో ఉగ్ర వేట…తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరిలో ఎన్ఐఏ బృందం తనిఖీలు

రెండు నెలల క్రితం బెంగళూరులో పట్టుబడిన ఉగ్రవాది జహిదుల్ ఇస్లాం ఇచ్చిన సమాచారం మేరకు ఎన్ఐఏ బృందాలు కుప్పం సరిహద్దు నందు తమిళనాడు రాష్ట్రం క్రిష్ణగిరిలోని పరిసర ప్రాంతాల్లో రెండు రోజులుగా తనిఖీలు చేపడుతున్నారు.

క్రిష్ణగిరి కొండపైనున్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. గతంలో భారత దేశంలో జరిగిన పలు బాంబు దాడులకు సంబంధించిన సంఘటనల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న జహిదుల్ ఇస్లాంను రెండు నెలల క్రితం బెంగళూరు సమీపంలో ఎన్ఐఏ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బంగ్లాదేశ్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్-ఉల్-ముజాహిద్దీన్ కు చెందిన జహిదుల్ ఇస్లాం భారతదేశంలో జరిపిన బాంబ్ బ్లాస్ట్ సంబంధించి క్రిష్ణగిరి కొండపైనే తలదాచుకుని బాంబులు తయారీ చేశాడనే సమాచారంతో ఎన్ఐఏ ఎస్పి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 25మంది పోలీసులు క్రిష్ణగిరి కొండపై తనిఖీలు చేపట్టారు. జహిదుల్ ఇస్లాం బాంబుల తయారీకి సంబంధించి ఉపయోగించిన పలు పైపులు, బ్యాటరీలు, వైర్లు అదే విధంగా అతనికి సంబంధించిన లగేజీతో పాటు కీలకమెన పలు పేపర్లను ఎన్.ఐ.ఏ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

భారతదేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్ళకు ఉపయోగించిన బాంబులను క్రిష్ణగిరి కొండపైన ఈ ఉగ్రవాద సంస్థ సభ్యులు తయారు చేశారనే విషయం వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా సరిహద్దు ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.