అనంత పద్మనాభస్వామి ఆలయం నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబాని ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు

అనంత పద్మనాభస్వామి దేవాలయం నిర్వహణపై భారత సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పును సోమవారం నాడు జస్టిస్ లలిత్, జస్టిస్ మల్హోత్రాల ధర్మాసనం స్పష్టమైన తీర్పు వెల్లడించింది.

ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్‌కోర్ రాజ వంశానికి కట్టబెడుతూ త్రివేండ్రం జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలోనూ కమిటీని కూడా నియమిస్తున్నట్టు ఇది ప్రభుత్వానికి, రాజకుటుంబానికి మధ్య మార్గంగా ఉంటుందని స్పష్టం చేస్తూ…. పద్మనాభస్వామి ఆలయ పాలన బాధ్యతను రాజకుటుంబానికి అప్పగించడాన్ని ధర్మాసనం సమర్ధించింది.

కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత కమిటీ కొనసాగుతుందని ఆలయంపై రాజ కుటుంబం హక్కులను న్యాయస్థానం సమర్ధించింది.

ఈ వివాదంపై 2011జనవరి 31న కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ట్రావెన్‌కోర్ రాజ వంశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారికి ప్రస్తుతం తీర్పు అనుకూలంగా వచ్చింది. 1991లో ట్రావెన్‌కోర్ రాజ వంశం చివరి పాలకుడు చనిపోవడంతో వారికి అన్ని హక్కులు నిలిచిపోయాయని కేరళ హైకోర్టు వెలువరించిన తీర్పును రద్దుచేసింది.

వాస్తవానికి ఈ కేసుపై విచారణను గత ఏడాది ఏప్రిల్‌లో పూర్తిచేసిన తీర్పును రిజర్వ్ చేసి తాజాగా, తుది తీర్పును సోమవారం వెలువరించింది.

ఆలయం సంపదలు, నిర్వహణ బాధ్యతలను ట్రావెన్ కోర్ రాజవంశం నుంచి స్వాధీనం చేసుకోవాలనే కేరళ హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజవంశం.. తమకే హక్కులు ఉంటాయని వాదించింది.

ఈ వాదనలను సమర్ధించిన సర్వోన్నత న్యాయస్థానం.. వారికే అనుకూలంగా తీర్పు చెప్పింది.

ఇక 2011లో అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అపార సంపదలు వెలుగుచూశాయి. అంతులేని సంపదతో ఈ ఆలయం వార్తల్లో నిలిచింది. నేలమాళిగల్లో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకూ దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టింది.

ఆలయంలోని ఆరు నేలమాళిగలలో ఇప్పటికే ఐదు నేలమాళిగలు తెరిచారు. అందులో బయటపడిన సంపద సుమారు ఐదు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.