పొదిలిలో అక్రమాల తొలగింపు: పురపాలక సంఘం కమిషనర్ కఠిన చర్యలకు ముందడుగు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్గదర్శకత్వంలో పొదిలి పట్టణాన్ని పచ్చదనంతో నింపే ప్రయత్నాలు సాగుతున్నాయని అందులో భాగంగా అక్రమాలను తొలగించడానికి చర్యలు చేపట్టినట్లు పొదిలి నగర పంచాయతీ కమిషనర్ కె యల్ నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు

ప్రధాన రోడ్లపై అక్రమాల పరిష్కారం

ఒంగోలు ప్రధాన రోడ్డు ప్రక్కన జరుగుతున్న పారిశుధ్య పనులు మరియు పూడిక తీత పనులను పర్యవేక్షించారు. అలాగే, చిన్న బస్ స్టాండ్ సెంటర్ వద్ద రోడ్డును ఆక్రమించిన ఫ్లెక్సీలను తొలగించడం

అక్రమ వ్యాపారాలపై కఠిన హెచ్చరిక

చిన్న బస్ స్టాండ్ ప్రాంతల్లో ప్రధాన రహదారిని దుకాణాలు, టీ కొట్లు, టిఫిన్ సెంటర్లు అక్రమంగా ఆక్రమించినట్లు గుర్తించామని సదరు ఆక్రమణదారులను ప్రత్యక్షంగా సంప్రదించి, “3 రోజుల్లోగా స్వచ్ఛందంగా తొలగించాలని”  లేకపోతే, పురపాలక సంఘం వారి చేతుల మీదుగా తొలగించబడతాయని, చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని మున్సిపల్ కమిషనర్ నారాయణరెడ్డి తెలిపారు

పురపాలక సంఘ ఆస్తులపై అక్రమ వసూళ్లు

కొంతమంది అక్రమార్కులు పురపాలక సంఘం స్థలాలను ఆక్రమించి, వేలం వేసి అద్దెలు వసూలు చేస్తున్నారని‌ ఈ అక్రమ వ్యవహారాల వల్ల పురపాలక సంఘానికి లక్షలాది రూపాయల నష్టం జరుగుతోందనే విషయాన్ని గుర్తించి, “ఎవరైనా వ్యాపారస్తులు పురపాలక సంఘానికి మాత్రమే అద్దె చెల్లించాలి, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి” అని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు

పెద్ద బస్ స్టాండ్ వద్ద కూడా అక్రమాలు

 

పెద్ద బస్ స్టాండ్ పరిసరాల్లో కూడా పురపాలక సంఘం ఆస్తులను ఆక్రమించి టిఫిన్ సెంటర్లు, కూల్ డ్రింక్స్ షాపులు, టీ స్టాల్లు నడుపుతున్నారు. ఈ వ్యాపారస్తులు ఒక్క పైసా కూడా పురపాలక సంఘానికి చెల్లించకుండా వ్యాపారం చేస్తున్నారు. కొంతమంది తమ దుకాణాల ముందు రోడ్లను కూడా ఆక్రమించి, ఇతర వ్యాపారస్తుల నుండి ₹3,000 నుండి ₹5,000 వరకు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని వారి పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఫ్లెక్సీలు, హోర్డింగ్లపై కఠిన నియంత్రణ

ఏవైనా ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు, హోర్డింగ్లు ఏర్పాటు చేయాలనుకుంటే, ముందుగా పురపాలక సంఘం అనుమతి తీసుకోవాలని ఇప్పటికే కొన్ని విద్యా సంస్థలు, మాల్స్ అనుమతి లేకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేసినందుకు వారిని హెచ్చరించారు

### “స్వచ్ఛ భారత్ – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల “స్వచ్ఛ భారత్” మరియు “స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాల క్రింద పొదిలిని “Bin Free – Litter Free” పట్టణంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నమని ఈ సందర్భంగా టిఫిన్ సెంటర్లు, టీ స్టాల్ లో యజమానులు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, గాజు గ్లాసులను మాత్రమే ఉపయోగించాలని అలాగే, తడి మరియు పొడి చెత్తను వేరు చేసి విసర్జించాలని తెలిపారు

అక్రమ నిర్మాణాలపై చర్య

పొదిలిలో అక్రమ నిర్మాణాలు, లేఔట్లు పెరుగుతున్నాయని ఇవి రోడ్లను ఇరుకుగా చేసి, పట్టణ అభివృద్ధికి అడ్డంకులను సృష్టిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని “ఎవరైనా ఇళ్లు నిర్మించాలంటే పురపాలక సంఘం అనుమతి తప్పనిసరి” అని పేర్కొన్నారు.

లంచం నిరోధక చర్యలు

పొదిలి పురపాలక సంఘం సిబ్బంది ఎవరైనా లంచాలు అడిగితే లేదా అనవసరంగా డబ్బులు వసూలు చేస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని కమిషనర్ హెచ్చరించారు.

పట్టణ ప్రజలు ఇంటి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు వంటి వాటిని సకాలంలో చెల్లించి, పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ కె యల్ నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు.